Sunday, August 30, 2009

పరమార్ధం

చేతులారంగ శివునిఁ బూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని
దయయు సత్యంబు లోనుగాఁ దలఁపడేనిఁ , గలుగ నేటికిఁ దల్లుల కడుపుచేటు.

-- పోతన భాగవతం నుంచి వామన జయంతి మరియు పరివర్తన ఏకాదశి సందర్భం గా

ఈ టపాలు గుర్తుకు తెచ్చుకుందాం!!

1. పోతనామాత్యుని పేదఱికము

2. బలి వృత్తాంతం

3. విష్ణు తిధి...ఏకాదశి

Monday, August 24, 2009

భ్రమ - భ్రాంతి - అజ్ఞానం

సంసారమనే భ్రమ కేవలం భ్రాంతి మూలకమే కాని పరమార్థ సత్యం కాదు.

ఆత్మ ఎకమూ అవయువ రహితమూ; శరీరం ఎన్నో అవయువాలు కలిగినది. కాని జనం ఈ రెండిటినీ ఒకటే అని భావిస్తారు. ఇంతకన్న అజ్ఞానం ఇంకొకటి ఉంటుందా?

-- శ్రీ శంకర ఉవాచ నుంచి

Thursday, August 20, 2009

వ్యర్ధ ప్రలాపం

ఏదైనా కాస్త ఉపయోగం కూడా లేని సంగతి చెపితే మా నాయనమ్మ చెపుతూ ఉండేది.
ఒరే, నువ్వు చెప్పింది "మా చచ్చిపోయిన గేద పగిలిపోయిన కుండెడు పాలు ఇచ్చేది" అన్నట్లు గా ఉందిరా! అని.

అంత గొప్ప విషయం సరే చూద్దాం అంటే "గేదా" చచ్చిపోయింది. పోనీ కుండ చూసి అది ఎంత గొప్ప గేదో నిర్ణయిద్దామంటే కుండా పగిలిపోయింది.

ఏ రకమైన జ్ఞానాన్నీ కలిగించ లేని ఇలాంటి విషయాలని "వ్యర్ధ ప్రలాపం" అనవచ్చు.

ఈ మధ్యన వార్తా పత్రికల్లొనూ, టి వీ చానళ్ళ లోనూ, ఇటువంటి విషయాలు చాల ప్రాముఖ్యతనిచ్చి చెపుతూ ఉంటే చూసి ఇక్కడ రాయాలనిపించింది.

బ్లాగుల్లో వ్యర్ధ ప్రలాపాలు ఎంతైనా చెయ్య వచ్చు.. ఇవి ఉన్నది అందుకే కదా!

--- ఈ రోజు పొలాల అమావాస్య. పొలం పనులన్నీ అయిపోయి పశువులకు పూజ చేసే రోజు . వర్షాభావం వాళ్ళ ఈ సంవత్సరం పొలం పనులు ఇంకా మొదలే కాలేదు!

Tuesday, August 11, 2009

జ్ఞాత

ధీ శక్తి ఉన్నంతదాకా అందు జ్ఞేయ వస్తువులుంటాయి. అది లేనిచో అవీ ఉండవు
జ్ఞాత సర్వకాలాలలోనూ జ్ఞాతయే
కనుక ద్వైతానికి అస్తిత్వం లేదు!

-- శ్రీ శంకర ఉవాచ నుంచి

నా వివరణ:
"ధీ శక్తి" జాగ్రత్, స్వప్న అవస్థల్లో మాత్రమే ఉంటుంది. సుషుప్తి లో ఉండదు.
1. జగ్రదావస్థలొ ఇంద్రియాల ద్వారా బయటికి ప్రసరించి బాహ్య జ్ఞేయ వస్తువులని ప్రకాశవంతం చేస్తుంది
2. స్వప్న అవస్థలో ఇంద్రియాలన్నీ మూయబడి ఉండటం వల్ల అంతరంగంలో జ్ఞేయ వస్తువులని సృష్టి చేస్తుంది
3. సుషుప్తి లో ధీ శక్తి లేక పోవడం వల్ల జ్ఞేయ వస్తువులు ఉండవు

కాని ఈ మూడు అవస్థల్లోనూ జ్ఞాత ఉంటాడు. (ఏకం ఏవ అద్వితీయం)
"ధీశక్తి", "జ్ఞేయ వస్తువులు" ఒక దాని మిద ఇంకొకటి ఆధార పడి ఉండగా, జ్ఞాత సర్వాధారమైన ఆత్మ గా, నిరాధారుడైన బ్రహ్మగా సర్వకాలాలలోనూ జ్ఞాతగా ఉంటాడు.

శ్రీ శంకరులు ఇంకొక సందర్భం లో ఇలా అంటారు
"ఆత్మ జ్ఞేయ విషయం కాదు. అందు బహుత్వ దోషం లేదు. కనుక అది ఎవరిచేతనైనా అంగీకరింపబడినదీ, నిరాకరింపబడినదీ కాదు."
మరొక సందర్భం లో:
"దేని జ్ఞానం వలన ఇక జ్ఞేయ విషయం మిగలదో, దేని ఆనందం వలన ఇక వాంఛనీయమైన ఆనందం ఉండదో, ఏది ప్రాపించుట వలన ఇక ప్రాప్యమే ఉండదో, దానిని బ్రహ్మమని తెలుసుకో"

ఓం తత్సత్

Friday, August 7, 2009

విష్ణు తిధి...ఏకాదశి

తొలి ఏకాదశి... వైకుంఠ ఏకాదశి... ముక్కోటి ఏకాదశి... ఆ పేరులోనే ఏదో పవిత్రత! అంతెందుకు, ఏకాదశి రోజును హరిదినం, వైకుంఠదినంగా కీర్తించాయి ధర్మసింధు వంటి గ్రంథాలు.

హిందూ సంప్రదాయంలో పరమపవిత్రమైన తిథి ఏకాదశి. ఎంత పవిత్రమైనదంటే... ఏడాదిలో వచ్చే 24 ఏకాదశులకూ ఏదో ఒక విశిష్టతను ఆపాదించి హరినామస్మరణ చేస్తారు భక్తులు. ఒక్కోరోజుకూ ఒక్కో ప్రాధాన్యత. వాటిలో ముఖ్యమైనది ఆషాడమాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి. దీన్నే ‘తొలిఏకాదశి’ అంటారు. పూర్వం ఆషాడశుద్ధ ఏకాదశినే సంవత్సరారంభంగా భావించేవారు కాబట్టి ఈ పేరు వచ్చిందని ప్రతీతి. శ్రీమహావిష్ణువు పాలసముద్రంలో శేషతల్పంపై శయనించే రోజు కాబట్టి ఈ రోజును శయనైకాదశి అని కూడా అంటారని పురాణాలు చెబుతున్నాయి. ఖగోళపరంగా చూస్తే ఈరోజుదాకా ఉత్తరదిశగా వాలి కనిపించే సూర్యుడు ఒకింత దక్షిణ దిశగా వాలినట్లు కనిపిస్తాడు. సూర్యుడంటే ప్రత్యక్షనారాయణుడు. అందువల్ల కూడా మన పూర్వులు ఈరోజును శయనైకాదశిగా వ్యవహరించి ఉండొచ్చని పండితుల అభిప్రాయం.

ఈరోజున ఏకాదశి వ్రతం చేసి విష్ణువును పూజించడం ఆచారంగా పాటిస్తారు భక్తులు. చాలా ప్రాంతాల్లో తొలిఏకాదశి నాడు ‘గోపద్మ వ్రతం’ చేస్తారు. అంటే గోవును పూజించడం అన్నమాట. ఈ నాలుగు నెలలూ వర్షాకాలం కాబట్టి పశువుల కొట్టాలను శుభ్రం చేసి వాటికి ఎలాంటి అనారోగ్యమూ రాకుండా కాపాడుకునే ప్రయత్నం ఇది. అలాగే ఈ నెల బహుళంలో వచ్చే ఏకాదశిని పాపనాశిని ఏకాదశి అంటారు. ఆరోజు విష్ణువును పూజించి ఏకాదశివ్రతం చేస్తే జన్మజన్మల పాపాలు నశిస్తాయని నమ్మిక.

శ్రావణశుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి, లలితైకాదశి అంటారు. ఆరోజున గొడుగు దానమిస్తే మంచిదని ప్రతీతి. ఇక బహుళంలో వచ్చేది కామిక ఏకాదశి. ఈరోజున వెన్న దానం చేయాలంటారు. భాద్రపద శుద్ధ ఏకాదశిని పరివర్తన ఏకాదశి అంటారు. ఈరోజు ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశిఘడియల్లో హరిని పూజిస్తే కరవుకాటకాలు తొలగిపోతాయని పద్మపురాణంలో ఉంది. విశ్వామిత్రుడికి మాటిచ్చి రాజ్యాన్నీ భార్యాబిడ్డలనూ కోల్పోయిన హరిశ్చంద్రుడు భాద్రపద బహుళ ఏకాదశి(దీన్నే అజ ఏకాదశి అంటారు)నాడు వ్రతం ఆచరించి అన్నిటినీ పొందగలిగాడని పురాణప్రవచనం.

ముక్కోటి ఏకాదశి కార్తీక శుద్ధ ఏకాదశి బహుళంలోది ఉత్పత్తి ఏకాదశి. విష్ణుమూర్తి శరీరం నుంచి పుట్టిన కన్య మురాసురుని సంహరించిన దినం ఇది. తొలిఏకాదశినాడు శయనించిన విష్ణుమూర్తి యోగనిద్ర నుంచి మేలుకునే రోజు కాబట్టి ఈ రోజును ఉత్థాన ఏకాదశి అని కూడా అంటారు భక్తులు. మార్గశిర శుద్ధంలో వచ్చేది మోక్షొకాదశి, సౌఖ్యదా ఏకాదశి. అప్పటికి ధనుర్మాసం కూడా వచ్చి ఉంటే ఆరోజును ‘ముక్కోటి/వైకుంఠ ఏకాదశి’ అంటారు. చాంద్రమానాన్ని బట్టీ ఇది ఒక్కోసారి మార్గశిరంలో మరోసారి పుష్యంలో వస్తుంది. ముక్కోటి ఏకాదశి నాడు విష్ణ్వాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. ఆరోజున స్వామిని ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకున్న వారికి మోక్షం లభిస్తుందని ప్రతీతి. అలాగే, అర్జునుడికి శ్రీకృష్ణుడు కురుక్షేత్రంలో విశ్వరూపం చూపి గీతాబోధన చేసింది ఈరోజేనని పురాణాలు చెబుతున్నాయి. ఇక మార్గశిర బహుళంలో వచ్చేది విమలైకాదశి. దీన్నే సఫలైకాదశి అని కూడా అంటారు. పుష్యశుద్ధంలిో వచ్చేది నంద/పుత్ర ఏకాదశి. అదే మాసం బహుళంలో వచ్చేది కల్యాణైకాదశి.

భీష్మఏకాదశి
మాఘశుద్ధ ఏకాదశిని భీష్మఏకాదశిగా ఆచరిస్తారు భక్తులు. ఈరోజునే కామదైకాదశి, జయైకాదశి అని కూడా వ్యవహరిస్తారు. మరో పదిహేను రోజులకు వచ్చేది విజయైకాదశి. ఆరోజున పాదరక్షలు దానం చేయడం మంచిదంటారు. రాముడు సేతువు నిర్మాణాన్ని ప్రారంభించి విజయం పొందిన రోజు ఇదేనని ఇతిహాసాలు చెబుతున్నాయి. ఫాల్గుణ మాసంలో ధాత్రైకాదశి, సౌమ్యైకాదశి వస్తాయి. చైత్రశుద్ధంలో వచ్చే ఏకాదశిని దమనైకాదశి అంటారు. దీనికే అవైధవ్య ఏకాదశి అని కూడా పేరు. చైత్ర బహుళ ఏకాదశినాడు ఉపవాసం ఉంటే వేయి ఆవులను దానం చేసిన పుణ్యం లభిస్తుందంటారు. ఈ రోజును వరూధిన్యైకాదశి అంటారు. వైశాఖ మాసంలో మొదట వచ్చే మోహిన్యేకాదశి నాడు చెప్పులు, పాలు, చల్లటినీరు... బహుళంలో వచ్చే సిద్ధైకాదశినాడు గొడుగు... దానం చేస్తే మంచిదంటారు. ఇవన్నీ సూర్యప్రతాపం నుంచి రక్షణ కల్పించేవే. జ్యేష్ఠంలోనూ అంతే. మొదటిది త్రివిక్రమైకాదశి. నీరు కూడా తాగకుండా ఉపవాసం చేస్తారు కాబట్టి దీన్నే నిర్జలైకాదశి అంటారు. ఆరోజు నీళ్లకుండలు, నెయ్యి, గొడుగు వంటివి దానం చేస్తారు. ఇక ఆఖరిది జ్యేష్ఠ బహుళ ఏకాదశి... దీన్నే యోగిన్యైకాదశి అంటారు.

ఏకాదశి కథ
విష్ణువు మురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేస్తూ అలసిపోయి సింహవతి అనే గుహలో దాక్కున్నాడట. అప్పుడాయన శరీరం నుంచి ఒక అందమైన కన్య ఉద్భవించి మురుడితో యుద్ధం చేసి సంహరించిందట. ఆ కన్య పేరే ఏకాదశి. ఆమె ధైర్యసాహసాలకు సంతోషించిన విష్ణువు ఆమెను ఏంకావాలో కోరుకోమంటే తాను విష్ణువుకు ప్రియతిథిగా అందరిచేతా పూజలందుకోవాలని కోరుకుందట. తథాస్తు అన్నాడు నారాయణుడు. నాటి నుంచి జనులు ఏకాదశి తిథిని పరమపవిత్రమైనదిగా భావిస్తున్నారని భవిష్యోత్తరపురాణం చెబుతోంది.

--- ఈనాడు ఆదివారం లో వచ్చింది

Wednesday, August 5, 2009

నేను నేనే!

జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిమ్
ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే!

ఆత్మ సాక్షాత్కారం పొందిన వారిలో నేనే వరిష్ఠుడను
నా ఆనందాన్ని సాక్షత్కరించుకుని ఆనందించేది కూడా నేనే
బాలకులు, చదువురాని వారు కూడా దేని మహిమను "నేను" అంటూ గుర్తిస్తారో అదే నేను.

-- శ్రీ శంకర ఉవాచ నుంచి హయగ్రీవ జయంతి సందర్భంగా

నానాచిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభా భాస్వరం
జ్ఞానం యస్య తు చక్షురాది కరణ ద్వార బహి స్పందతే
జానామీతి తమేవ భాంతమ్ అనుభాతి ఏతత్ సమస్తం జగత్
తస్మై శ్రీ గురు మూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

గురవే సర్వలోకానాం, భిషజే భవరోగిణామ్
నిధయే సర్వ విద్యానాం, దక్షిణామూర్తయే నమః