Monday, April 18, 2011

అగ్నిని అగ్ని కాల్చదు

అథవా చారుసర్వాఙ్గీ రక్షితా స్వేన తేజసా
న నశిష్యతి కల్యాణీ నాగ్నిరగ్నౌ ప్రవర్తతే - సుందర కాండ, 55 వ సర్గ, 23వ శ్లోకం

హనుమ లంకాదహనం చేసి, తాను చేసిన అనాలోచితమైన పని వల్ల సీతమ్మకు ఏదైనా ఆపద కలిగిందేమో అని చింతిస్తూ ఇలా అనుకున్నాడు:
సీతను ఆమె తేజస్సే రక్షిస్తూన్నది. మంగళప్రదురాలైన అలాంటి సీత నశించదు. అగ్నిని అగ్ని కాల్చజాలదు కదా!

-- మహా చైత్రీ, శ్రీఖర నామ సంవత్సర చైత్ర శుద్ధ పూర్ణిమ, చిత్రానక్షత్రం, సొమవారం.

Thursday, April 14, 2011

రామాఖ్యం మన్మహే మహః

"వైదేహీవివృతం దివ్యం సచ్చిత్సుఖరసం చ యత్,
వైదేహీవిచితం ధ్యేయం తాపత్రయహరం చ యత్,
వైదేహీసంయుతం ధర్మ్యసంసిద్ధిదం చ యత్,
జ్ఞానధ్యానాధ్వరాప్యం తత్ రామాఖ్యం మన్మహే మహః" 1,2

"ప్రమాతా చ ప్రమాణం చ ప్రమేయం చ ప్రమేతి హ
యదేకం భాతి తత్సర్వం రామాఖ్యం మన్మహే మహః" 3

1,2 : "దివ్యమూ, సచ్చిదానందరూపమూ అయిన ఏ మహాతేజస్సు విదేహముక్తావస్థయందు ఆవిష్కృతం అవుతుందో, ధ్యానింపదగినదీ, త్రివిధతాపవినాశకమూ అయిన ఏ తేజస్సు దేహస్మృతి కూడ లేని నిర్వికల్పసమాధిస్థితిలో అన్వేషింపబడుతుందో వైదేహీదుహితా సహితమూ ధర్మసంరక్షకమూ అయిన ఏ తేజస్సు ధర్మసంమత మైన సిద్ధిని ప్రసాదిస్తుందో, అట్టి 'రామ' అను పేరుతో ఉన్న జ్ఞాన - ధ్యాన - యజ్ఞములచే పొందదగిన మహా తేజస్సును మననం చేయుచునాము."
3: "అద్వితీయమైన ఏ మహాతేజస్సు ప్రమాతగాను, ప్రమాణముగాను, ప్రమేయముగాను, ప్రమగాను భాసిస్తూన్నదో, 'రామ' అను సకలజదాత్మయైన ఆ మహా తేజస్సును మననం చేయుచున్నాము."

-- ఇది మహామహోపాధ్యాయ ఆచార్య డా. పుల్లెల శ్రీరామచంద్రుడు గారి పితృచరణులు బ్రహ్మశ్రీ పుల్లెల సత్యనారాయణ శాస్త్రి గారు రచించి అనుదినమూ బ్రాహ్మీముహుర్తమున వారిచే ఉపాంశుజపమందు అనుసంధానము చేయబడిన శ్రీ రామాద్వైత ప్రతిపాదక శ్లొకత్రయము.
-- ( శ్రీమద్రామాయణామృతతరంగిణిలో మనోభావ లహరీ విలాసాలు అనే గ్రంధం నుంచి )

Monday, April 11, 2011

జానకీపతీ! నిను నమ్మితి, నిన్నే నమ్మితి.

నమ్మితి రామచంద్ర మది నమ్మితి రాజకులేంద్ర మేలుగా
నమ్మితిఁ గీర్తిసాంద్ర కడునమ్మితి దాసచకోరచంద్ర నా
నమ్మిక లేమి చేసెదవొ నమ్మగ నర్హుల గానివారలన్
నమ్మనయా దయాబ్ధివని నమ్మితి నిన్మది జానకీపతీ

వందే నీలసరోజకోమలరుచిం వందే జగద్వందితం
వందే సూర్యకులాబ్ధికౌస్తుభమణిం వందే సురారాధితమ్
వందే సాధకవంచక ప్రహరణం వందే జగత్కారణం
వందే వింశతిపంచతత్త్వరహితం వందే సదా రాఘవమ్

-- స్వస్తి శ్రీ ఖర నామ సవంత్సర శ్రీరామనవమి సందర్భంగా

Sunday, April 10, 2011

అన్యోన్య దాంపత్యం

వరుడు:
హరం సర్పహారం చితాభూవిహారం
భవం వేదసారం సదా నిర్వికారం
శ్మశానే వసంతం మనోజం దహంతం
శివం శంకరం శంభుమీశానమీడే
వధువు:
నానారత్న విచిత్రభూషణకరీ హేమాంబరాడంబరీ
ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజ కుంభాంతరీ
కాశ్మీరాగరువాసితాంగ రుచిరా కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

ఇలా వధూవరుల స్వరూపాలు పరస్పర విరుద్ధంగా ఉన్నా "ఆది దంపతులు" ఎలా విడదీయలేకుండా ఉంటారో మహాకవి కాళిదాసు మాటల్లో:
వాగర్థా వివసంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ
యౌ: ఎవరు, వాగర్థావివ: శబ్దార్థములవలె, సంపృక్తౌ: కలిసియుండిరో, జగతః జగతికి, పితరౌ: తలిదండ్రులో, తౌ : ఆ, పార్వతీ పరమేశ్వరౌ : పార్వతిని పరమేశ్వరుని, వాగర్థ ప్రతిపత్తయే : శబ్దార్థములను సరిగా ఎరుగుటకు, వందే : నమస్కరించుచున్నాను.

అలాంటి అన్యోన్య దంపతులు లోకానికి మేలు జరగడం కోసం ఎలా ప్రవర్తిస్తారో పోతన భాగవతం లో:
మ్రింగెడు వాడు విభుండని మ్రింగెడిది గరళమనియు మేలని ప్రజకున్
మ్రింగుమనె సర్వమంగళ మంగళ సూత్రమ్ము నెంతమది నమ్మినదో
ఈ పద్యం లో ముఖ్యంగా క్రింది విషయాలని గమనించాలి.
1. హాలాహలాన్ని వామ హస్తం లో గ్రహించిన శివుడు పార్వతి ఆమోదం కొరకు చూడటం
2. పార్వతీ దేవికి భర్త మీద (మంగళ సూత్రం మీద) గల నమ్మకం
3. ప్రజా హితమైన కార్యం కోసం త్యాగం చేయగలగడం

-- ప్రతీ దంపతుల జంటా ఈ "ఆది దంపతులను" ఆదర్శంగా తీసుకుని జీవిస్తే జగత్తుకు ఎల్లప్పుడూ సర్వ మంగళమే జరుగుతుంది.

Saturday, April 9, 2011

తత్వరహస్యప్రభ

సోపాన పంచకము

వేదోనిత్య మధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం
తేనేశస్య విధీయతా మపచితిః కామ్యేమతి స్త్యజ్య
తాం
పాపౌఘః పరిధూయతాం భవసుఖే దోషో7ను సంధీయతా
మాత్మేచ్ఛావ్యవసీయతాం నిజగృహాత్తూర్ణం వినిర్గమ్యతాం||

సంగస్సత్సునిధీయతాం భగవోతో భక్తి ర్దృఢాధీయతాం
శాంత్యాధాఃప చీయతాం ధృఢతరంకర్మాశు సంత్యజ్యతాం
సద్విద్వాసుపర్ప్యతా మనుదినం తత్పాదుకాసేవ్యతాం
బ్రహ్మేశాక్షంమర్థ్యతాం శృతిశిరోవాక్యం సమాకర్ణ్యతాం||

వాక్యార్థశ్చ విచార్యతాం శృతిశిరఃపక్షస్ససూశ్రియతాం
దుస్తర్కాత్సునిరమ్యతాం శృతిమత స్తర్కో7నుసంధీయతాం.
బ్రహ్మాస్మీతి విభావ్యతా మహరహర్గర్వః పరిత్యజ్యతాం
దేహే7హం యతిరుర్ఘుతాం బుధజనైః వాదస్స ముత్సృజ్యతాం||

క్షుద్వ్యాధిశ్చ చికిత్స్యతా మనుదినం భిక్షాపథం భుజ్యతాం
స్వాద్వన్నం నతుయాచనతాం విధివశాత్ప్రాప్తేన సంతుష్యతాం
ఔదాసీన్య మభీప్స్యతాం జనకృపా నైష్ఠుర్య ముత్సృజ్యతాం
శీతోష్ణాది విషహ్యతాం నతువృధావాక్యం సముచ్చార్యతాం ||

ఏకాంతే సుఖమాస్యతాం పరతరే చేతస్సమాధీయతాం
పూర్ణాత్మాసు సమీక్ష్యతాంజగదిదం తాద్బాధితందృశ్యతాం
ప్రాక్కర్మాపి విలావ్యతాం చితిబలాన్నాప్యుత్తరైశ్ల్శిష్యతాం
ప్రారబ్ధం త్విహభుజ్యతా మధ పరబ్రహ్మాత్మ నాస్థీయతాం ||


శ్రీమద్వైతోపదేశ పంచరత్నములనే సోపాన పంచకస్తోత్రములో మొదటినుండి క్రమముగా ఒకమెట్టు తరువాత మరియొకమెట్టు ఎక్కుటకు వీలుచేసినట్టి సాధన పరంపరను చెప్పిరి. అర్థజ్ఞాన సాధనమైన శాస్త్రముతోసహ వేదమును నిత్యం చదువవలయును. ఆ వేదోక్తకర్మలను ఈశ్వరార్పణ బుద్ధ్యా చేయవలయును. ఇట్టి నిష్కామకర్మవలన జ్ఞాన ప్రతిబంధకమైన పాపములను పోగొట్టుకొనవలయును, తరువాత వైరాగ్యం కొరకే విషయసుఖములను దోషదృష్టితో విడచి పెట్టవలయును. పరమాత్మను తెలుసుకుందామనే జిజ్ఞాసను బలముగా సంపాదించవలయును. విషయములయందు విరక్తుడై, తత్వజిజ్ఞాసకలవాడై యిల్లు (భార్యా పుత్రాదులను వదలి అభిమానమును వదలి) వెళ్లి తత్వ విచారము చేయు మహాత్ములతో సహవాసం చేయవలయును.

దృఢమైన భగవద్భక్తినికూడా సంపాదించవలయును. శమదమాది సంపత్తినికూడా సంపాదించవలయును. కర్మసన్యాసం చేయవలయును. అనగా సన్యసించవలయును, వెనుకటి సామాన్య సజ్జనసాంగత్యము కాక, బ్రహ్మనిష్ఠులైన విద్వాంసులైన సద్గురువులవద్దకు వెళ్లవలయును. వారికి అనుగ్రహం కలిగేటట్లు వారి పాదసేవ చేయవలయును. వారియనుగ్రహం సంపాదించి, బ్రహ్మతత్వమును చెప్పమని యడుగవలెను. వారి వలన వేదాంత వాక్యములను మహావాక్యములను అర్థముతో వినవలయును. అసంభావనా విపరీతభావనలు పొయ్యేంతవరకు మహావాక్యార్థమైన జీవబ్రహ్మైక్యవిచారం చేయవలయును. శృతులకు విరుద్ధమైన మతము లను ఆశ్రయించకుండా శృతిసమ్మతమైన అద్వైతసిద్ధాంతమునే ఆశ్రయించవలయును.

శృతులకు విరుద్ధమైన యుక్తిరూపమగు తర్కమును వదలివేయవలయును. శృతులకు సమ్మతమైన యుక్తులనే గ్రహించవలయును. మననం చేయమని యర్థము. తరువాత, నేను బ్రహ్మస్వరూపుడనని ధ్యానం చేయవలయును. నేను జ్ఞానినికదా యని అహంకారమును వదలి వేయవలయును. దేహేంద్రియములయందు నేననే భ్రమను వదలివేయవలయును. ఇతర మతస్థులైన విద్వాంసులతో వివాదమును వదలుము. నిత్యం భిక్షాటన చేత లభించిన ఆహారముతో ఆకలిని శమింపచేసుకొనుము. అనారోగ్యం కలిగినపుడు ఔషధసేవచేసి శరీరం నిలబెట్టుకొనుము. ఔషధ సేవవలెనే భిక్షాభోజనంకూడా శరీరమును రక్షించుకొనుటకేకాని, భోగప్రధానముగా రుచియైన పదార్థములను కోరకూడదు. లాభాలాభముల యందు సమానబుద్ధితో ప్రవృత్తిలేకుండా ఊరికే ఉండవలయును. తన తత్వనిష్ఠకు ప్రతిబంధకంగా ఎవరియందును దయతోగాని, క్రోధముతో గాని కలుగచేసుకొనవద్దు. శీతోష్ణములను సుఖ దుఃఖములను సహించవలయును. వ్యర్థమైన సంభాషణలేకుండా మౌనము నవలంభించవలయును.

అట్టి మోక్షమును అభ్యసించుటకు నిర్జనప్రదేశమందు (నివసించ) ఉండవలయును. మౌనంగా నుండి పరబ్రహ్మ యందు మనస్సును నిలిపి ధ్యానం చేయవలయును. బ్రహ్మసాక్షాత్కారమును పొందవలయును. బ్రహ్మానుభూతిచేత సకలద్వైత భ్రమను నశింపచేసుకొనవలయును. ఆత్మజ్ఞానంవలన సంచిత కర్మరాశిని దహింపచేయుము. ఆగామిని అంటకుండా వుండుము. ఒక ప్రారబ్ధము మాత్రమే వుండునుగనుక అనుభవించుము. ఆ ప్రారబ్ధం పోయిన తరువాత పరబ్రహ్మరూపముగా నుండును. అని శ్రీశంకర భగవత్పాదులవారు యేస్థితినుండి యేయే స్థితికి వెళ్ళవలయునో యెట్లు ప్రయత్నించవలయునో, యేదిచేస్తే యేస్థితి కలుగునో విశదముగా నుపదేశించిరి.

-- శ్రీ శంకరాచార్య విరచితమగు శ్రీమద్వైతోపదేశ పంచరత్నములనే మరియొక పేరుగల సోపాన పంచకమునకు మద్దులపల్లి మాణిక్యశాస్తిచ్రే రచింపబడిన తత్వరహస్యప్రభ నుంచి